మల్టీ నేషనల్ కంపెనీ యాక్సెంచర్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్ని మార్చేసింది. సాయంత్రం 5.30 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఆఫీస్ కాల్స్ చేయకూడదని నిర్ణయించింది. శుక్రవారం కూడా మీటింగ్స్ తగ్గించాలని నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల ఒత్తిడి తగ్గించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. నార్త్ ఈస్ట్ అమెరికాలో యాక్సెంచర్ మార్కెట్ యూనిట్ లీడ్ జాక్ అజాగురీ ఈ నిర్ణయాలను ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సాయంత్రం 5.30 లోగా కాన్ఫరెన్స్ కాల్స్ ముగించాలని టీమ్ లీడర్లను ఆదేశించారు. శుక్రవారం ఎక్కువగా మీటింగ్స్ పెట్టొద్దని సూచించారు. అంతేకాదు... వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకునేలా కంపెనీ శిక్షణ ఇస్తోంది. ఇంట్లో నుంచి పనిచేస్తున్నా మధ్యమధ్యలో బ్రేక్స్ తీసుకోవాలని సూచిస్తోంది. యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా 200 ఆఫీసులు ఉన్నాయి. 5,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 95 శాతం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్కు పంపించారు. లాక్డౌన్ కాలంలో ఉద్యోగులక ప్రొడక్టివిటీ పెరిగింది. అయితే ఉద్యోగులు వర్క్, లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోంది కంపెనీ. ఉద్యోగులు పని విషయంలో ఎక్కువ సామర్థ్యం చూపిస్తున్నా థియేటర్లు, రెస్టారెంట్లు మూతపడటంతో ఎంటర్టైన్మెంట్కు దూరమవుతున్నారు. అందుకే పని ఒత్తిడిని మేనేజ్ చేయడానికే కంపెనీ ప్రాధాన్యం ఇస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు కావాల్సినప్పుడల్లా అందుబాటులో ఉంటారని చాలా కంపెనీలు భావిస్తున్నాయని, ఆఫీస్ వేళల్లో కాకుండా ఎప్పుడంటే అప్పుడు కాల్స్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఇటీవల కంప్లైంట్లు పెరిగాయి. తమ కంపెనీ అలా కాదని చెప్పేందుకు యాక్సెంచర్ కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.