ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అయిపోయింది.. ఇప్పుడు ఓటు జిహాద్: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 08:46 PM

ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సాగుతోంది. బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఓ వైపు.. వివిధ పార్టీలతో కలిసి ఏర్పడిన ఇండియా కూటమి మరోవైపు.. ఎన్నికల సంగ్రామంలో పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 దశల పోలింగ్ పూర్తి కాగా.. మిగిలిన విడతలకు కూడా సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలు, నేతలు తమ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. ఇక ప్రచారంలో భాగంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీలక నేత మరియా ఆలం చేసిన ఓట్ జిహాద్ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే మరియా ఆలం వ్యాఖ్యలపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.


గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. మరియా ఆలంపై, ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి చేసిన ప్లాన్‌ను మరియా ఆలం బయటికి చెప్పారని ప్రధాని ఆరోపించారు. ముస్లింలు ఓట్ జిహాద్‌కి వెళ్లాలని.. అందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని మరియా ఆలం కోరారని తెలిపారు. మదర్సా నుంచి బయటకు వచ్చిన పిల్లల నుంచి కాకుండా.. ఓ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముస్లింలంతా కలిసి ఓటు వేయాలని ఇండియా కూటమి చెబుతోందని.. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


ఇక మరియా ఆలం చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ.. ఇండియా కూటమి నేతలు గానీ ఎవరూ వ్యతిరేకించలేదని ప్రధాని మోదీ తెలిపారు. ఒక వైపు ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను విభజించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని.. మరోవైపు ఓట్ జిహాద్ నినాదాన్ని లేవనెత్తుతోందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా వారి ఉద్దేశాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెబుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.


సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన మరియా ఆలం.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్‌కు స్వయానా మేనకోడలు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ ఫరూఖాబాద్‌లో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన మరియా ఆలం.. ఓట్ జిహాద్‌కి పిలుపునివ్వడం తీవ్ర వివాదానికి కారణం అయింది. ముస్లిం ఓటర్లు ఓటు జిహాద్ ప్రారంభించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఓట్ జిహాద్ ఒక్కటే మార్గమని మరియా ఆలం చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని ప్రజలు అంటున్నారు.. కానీ మానవత్వం ప్రమాదంలో ఉందని తాను చెబుతానని మరియా పేర్కొన్నారు.


మరియా ఆలం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. రంగంలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు మరియా ఆలంతో పాటు ఆ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన సల్మాన్ ఖుర్షీద్‌లపై కేసులు పెట్టారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదైంది. అయితే మరియా ఆలం చేసిన ఓట్ జిహాద్ వ్యాఖ్యలను సల్మాన్ ఖుర్షీద్ సమర్థించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com