ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ‌కారణంగానే మా కుమార్తె చనిపోయింది.. కోర్టుకెక్కిన తల్లిదండ్రులు

national |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 08:42 PM

ప్రపంచం మొత్తాన్ని 2,3 ఏళ్లపాటు గడగడలాడించిన కరోనా మహమ్మారిని నివారించేందుకు రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక బ్రిటన్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా కూడా ఒక టీకాను తయారు చేసింది. దాన్ని భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో విడుదల చేసింది. అయితే కరోనా వ్యాక్సిన్లపై మొదటి నుంచి అనుమానాలే ఉన్నా.. ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటంతో ప్రజలు టీకాలు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. కొందరు మాత్రం కరోనా టీకాలను వేసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే ఇటీవల కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని దాన్ని తయారు చేసిన ఆస్ట్రాజెనెకా సంస్థ బ్రిటన్ కోర్టులో అంగీకరించడంతో మరోసారి కరోనా వ్యాక్సిన్ల సమర్థతపై తీవ్ర చర్చ జరిగింది.


ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. తమ కుమార్తె కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాతే చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. ఈ వ్యవహారం దేశంలో కీలక చర్చయనీయాంశంగా మారింది. భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మహారాష్ట్ర పూణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ తయారు చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు.. థ్రాంబో సైట్ పెనియా సిండ్రోమ్-టీటీఎస్ బారిన పడినట్లు బ్రిటన్‌లో జరుగుతున్న న్యాయవిచారణలో ఆ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే తమ కుమార్తె అదే టీకా తీసుకుని చనిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం గమనార్హం.


వేణుగోపాలన్ గోవిందన్ అనే వ్యక్తి.. తన కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నాడు. 2021 జూలైలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కారుణ్య.. ఆ తర్వాత చనిపోయింది. ఈ క్రమంలోనే వేణుగోపాలన్ గోవిందన్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయంపైనే సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌పై దావా వేశాడు. కానీ కారుణ్య మరణంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ మెడికల్ బోర్డు మాత్రం.. ఆమె కోవిషీల్డ్ వ్యాక్సిన్ కారణంగా చనిపోయిందని నిర్ధారించలేదు.


కోవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయని.. ఆ టీకాను తయారు చేసిన బ్రిటన్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా.. అక్కడి కోర్టులో ఒప్పుకుంది. అయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో చాలా మంది తీసుకోవడంతో.. ప్రస్తుతం వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఆరోగ్యపరమైన సమస్యలపై దర్యాప్తు చేయించేందుకు ఆ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com