అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పల్నాడు జిల్లాలోని అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు మేకల హనుమంతరావు. పార్టీ పెద్దల తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వైఖరితో విసుగుచెందామని.. సంవత్సరన్నర కాలంగా వేధింపులకు గురిచేశారని హనుమంతరావు యాదవ్ ఆరోపించారు. బీసీల ఎదుగులను ఆయన ఓర్వలేకపోతున్నారని అన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చినా కొత్తగా ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ పెద్దలకు సమాచారం అందించినా పట్టించుకోలేదని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో వరుసగా జరుగుతున్న అవమానాలను భరించలేక తమ అనుచరులతో సహా పార్టీకి రాజీనామా చేస్తున్నాం అని హనుమంతరావు తెలిపారు.