ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని.. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కు దారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు. ఎన్నికలు కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోనేవారమన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు సలహాలు, సూచనలు ఇచ్చిందన్నారు. ప్రజల ఆస్తులను మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన అని చెప్పుకొచ్చారు. వైసీపీ పథకాలను, మేనిఫెస్టో పేజీలను చంద్రబాబు కాఫీ కొట్టారని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టో చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికి రాదన్నారు. ఎన్డీయే మేనిఫెస్టోపై మోదీ, పురంధేశ్వరి బొమ్మలు ఏవి అని ప్రశ్నించారు. కూటమి పార్టీలే మేనిఫెస్టోను అంగీకరించనప్పుడు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆమోదించాలన్నారు. మంచి పని చేస్తున్న సీఎం జగన్ ఫోటో సర్వే రాళ్ళ మీద వేస్తే తప్పేంటి? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.