ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు. రాయల వారు పరిపాలించిన నేల చంద్రగిరి అని తెలిపారు. ఇదే గడ్డపై విజనరీ లీడర్ అయిన తాను జన్మించానని తెలిపారు. తాను కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది ఈ జిల్లానే (చిత్తూరు) అని తెలిపారు. ‘‘నన్ను జగన్ పదే పదే ముసలోడని అంటున్నారు.. డేట్, టైం ఫిక్స్ చేయ్.. తిరుమల కొండకి నేను, నువ్వు కాలినడకన వెళ్దాం. ఎవరూ తర్వగా కొండపైకి వెళ్తారో చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు’’ అని చంద్రబాబు సవాల్ విసిరారు. తన హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించిందని చెప్పారు. జగన్ పాలనలోనూ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది.. కానీ అభివృద్ధిలో కాకుండా గంజాయి, డ్రగ్స్, ప్రమాదకరమైన మద్యం విక్రయాల్లో నెంబర్ 1గా ఉందని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు. తన హయాంలో జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చానని అన్నారు. 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానని చెప్పుకొచ్చారు. దేశంలో విక్రయిస్తున్న పలు ఉత్పత్తులు చిత్తూరు జిల్లా నుంచి తయారు చేస్తున్నావేనని తెలిపారు.తన హయాంలో రెండు డీఎస్సీలు వేసి.. 32వేల ఉద్యోగాలు భర్తీ చేశానని గుర్తుచేశారు. తన హయాంలో 11 డీఎస్సీలు వేసి.. లక్షా యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశానని ఉద్ఘాటించారు.