ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీచ్‌లు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దు.. దుబాయ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

international |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 09:00 PM

ఎడారి దేశం దుబాయ్‌లో ప్రస్తుతం అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎడారి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. అప్పటికప్పుడే దట్టమైన మేఘాలు ఏర్పడి.. ఆకాశానికి చిల్లుపడినట్టు వర్షం కురిసి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, మాల్స్, రహదారులు, వ్యాపార సంస్థలు నీటమునిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మే మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.


రెండు రోజుల పాటు ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. ‘ దయచేసి బీచ్‌లకు దూరంగా ఉండండి.. నౌకాయానం చేయొద్దు.. కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దు.. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త ఉండాలి’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అధికారుల సూచనలు, మార్గదర్శకాలను ప్రజలను పాటించాలని పేర్కొంది. ఇప్పటికే దుబాయ్ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ఇప్పటికే రెస్క్యూ చర్యలు ప్రారంభించింది.


వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు ప్రయివేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలను కూడా మూసివేశారు. దుబాయ్‌లోని పోర్ట్స్, కస్టమ్స్ అండ్ ఫ్రీ జోన్ కార్పొరేషన్ కూడా నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది.


ఏడాది వర్షం ఒక్క రోజులోనే.. దుబాయ్‌లో వరద బీభత్సం చూశారా


దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు రేపటి ప్రతికూల వాతావరణానికి సంబంధించి ప్రయాణీకులకు సలహాలను కూడా జారీ చేసింది. అధికారులు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రారంభించాలని మరియు వారు కారులో లేదా ప్రజా రవాణాలో ప్రయాణించినా సకాలంలో విమానాశ్రయానికి చేరుకోవడానికి కొంత అదనపు ప్రయాణ సమయాన్ని జోడించాలని కోరారు. విమాన ప్రయాణీకులకు కూడా దుబాయి ఎయిర్‌పోర్ట్ సూచనలు జారీ చేసింది. విమానాశ్రయానికి చేరుకోడానికి ముందే ప్రయాణం ప్రారంభించాలని సూచించింది.


ఏప్రిల్ 16 కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్‌ చిగురుటాకులా వణికిపోయింది. ఎడతెగని వర్షాలతో వీధులు, ఇళ్లు, రోడ్లు నదులను తలపించాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. అలాగే, సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పొరుగున ఉన్న ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైంది. గత 75 ఏళ్లలో ఎన్నడూ చూడని భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com