హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కన్నడ నాడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అయితే, ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు బలైపోయిన బాధితుల్లో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుల్లో మైనర్లు నుంచి 50 ఏళ్లు దాటిన మహిళలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.. తన కుమార్తెకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు రుజువైతే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని సిట్కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి బీకే సింగ్ తెలిపారు. పలు వీడియోల్లో ప్రజ్వల్, మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. ప్రజ్వల్, రేవణ్ణ ప్రాథమిక విచారణతో పాటు బాధితురాలి నివాసానికి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటికే ఆమె నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ప్రజ్వల్ విచారణకు రాకుండా విదేశాల్లోనే ఉండిపోతే లుకౌట్ లేదా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని బీకే సింగ్ అన్నారు. మరోవైపు, వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ వారం రోజుల్లో భారత్కు తిరిగొస్తానని ప్రకటించారు. అయితే, శుక్రవారం రాత్రికే తన కుమారుడు బెంగళూరుకు రానున్నారని హెచ్డీ రేవణ్ణ వెల్లడించారు. శనివారమే విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజ్వల్ గరిష్ఠంగా మూడు నెలలు జర్మనీలో ఉండే అవకాశం ఉన్నా.. దర్యాప్తు నేపథ్యంలో తిరిగి వస్తున్నారని రేవణ్ణ తెలిపారు.
కాగా, వీడియోల్లో ప్రజ్వల్తో కనిపించిన బాధితుల వివరాలను పోలీసులు, సిట్ అధికారులు గుర్తించారు. ఫిర్యాదు చేస్తే ప్రజ్వల్పై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినా.. చాలా మంది తమను సంప్రదించవద్దని తెలిపారు రేవణ్ణ ఇంట్లో పని చేసిన వారి బంధువైన మహిళ మినహా ఇప్పటి వరకు మరెవరూ ఆయనపై ఫిర్యాదు చేయలేదు. హాసనతో పాటు ఇతర చోట్ల ఉన్న గెస్ట్హౌస్లను ప్రజ్వల్ ఉపయోగించుకుని, అక్కడే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.