సంప్రదాయ బద్దంగా జరగని హిందూ వివాహం చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి సాక్ష్యంగా నిలుస్తుంది. కానీ, చట్టంలోని సెక్షన్ 7 ప్రకారమే వివాహం జరగాలి. అంటే వివాహ వేడుకలో సప్తపది నిర్వహించాలని పేర్కొంది. వివాహం అనేది బరాత్లు, విందులు, వినోదాలు లేదా ఆర్దిక లావాదేవీల కోసం జరిగే కార్యక్రమం కాదని ఉద్ఘాటించింది. హిందూ వివాహం ఓ క్రత్రువని, భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సంస్థగా దాని హోదాను పొందాల్సిన మతకర్మ అని పేర్కొంది. ఈ మేరకు శాస్త్రోక్తంగా వివాహం చేసుకోని ట్రెయినీ కమర్షియల్ పైలట్లు విడాకుల కేసులో ఇటీవల జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టైన్ జార్జ్ మస్హిల ధర్మాసనం తీర్పు చెప్పింది.
‘భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైంది.. వైవాహిక బంధంలోకి ప్రవేశించే ముందు దాని గురించి యువతీ యువకులు లోతుగా ఆలోచించాలి’ అని ధర్మాసనం సూచించింది. ‘హిందూ ధర్మంలో పెళ్లికి పవిత్రత ఉంది. భారతీయ సమాజంలో ఇది ఒక ప్రాథమిక వ్యవస్థ.. భవిష్యత్తు తరాలకు స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే బలమమైన పునాది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొత్త తరానికి పునాది చేస్తుందని, వివిధ వర్గాలలో సోదర భావాన్ని పటిష్టం చేస్తుందని అభిప్రాయపడింది.
‘(హిందూ వివాహ) చట్టంలోని నిబంధనల ప్రకారం సంప్రదాయాలకు విరుద్ధంగా భార్యాభర్తల హోదాను పొందాలని కోరుకునే వ్యక్తుల ఆలోచనలను మేము నిరాకరిస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. పెళ్లిలో భార్యాభర్తలుగా ఒక్కటయ్యే స్త్రీ,పురుషులు ఏడడుగులు వేసే సప్తపది లాంటి సంప్రదాయ ఆచారాలను నిర్వహించకపోతే అది హిందూ వివాహం కాదని తెలిపింది. ‘హిందూ వివాహం ఒక పవిత్రమైన కార్యక్రమం... ఋగ్వేదం ప్రకారం సప్తపది పూర్తి చేసిన తర్వాత వరుడు మనం ‘ఏడడగులతో దంపతులుగా మారాం.... ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ బంధం విడిపోదు’ అని వధువుకు చెప్పడం.. అంటే భార్య తనలో సగం (అర్ధాంగిని) అని పరిగణించడం’ అని ధర్మాసనం పేర్కొంది..
‘హిందూ చట్టంలో వివాహం అనేది ఒక 'క్రతువు’ ఇది కొత్త కుటుంబానికి పునాది.. ఇది ఏకభార్యత్వాన్ని ఆమోదించింది.. హిందూ వివాహ చట్టం బహుభార్యత్వం సహా ఇతర సంబంధాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.. వివిధ సంప్రదాయ ఆచారాలతో జరిగిన పెళ్లికి ఏకత్వం ఉండాలనేది పార్లమెంటు ఉద్దేశం’ అని పేర్కొంది. మే 18, 1955న అమల్లోకి వచ్చిన తర్వాత హిందువుల మధ్య వివాహానికి సంబంధించిన చట్టాన్ని సవరించాం... ఇందులో కేవలం హిందువులే కాకుండా లింగాయత్లు, ఆర్యసమాజం, బౌద్ధులు, జైనులు, సిక్కులకు కూడా చోటు కల్పించామని ధర్మాసనం వెల్లడించింది.