ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ మహిళా కమిషన్‌లో 223 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. గవర్నర్ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 08:57 PM

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య విబేధాలు గురువారం మరో మలుపు తిరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీచేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఈ నియామకాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వులో ఢిల్లీ మహిళా కమిషన్ చట్టాన్ని ఉదహరిస్తూ.. ప్యానెల్‌కు 40 మంది ఉద్యోగుల మంజూరైతే.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే 223 కొత్త పోస్టులను సృష్టించారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే అధికారం కమిషన్‌కు లేదని ఉత్తర్వులో తెలిపారు.


అంతేకాదు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోరాదని కమిషన్‌కు తెలియజేసినట్లు కూడా ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ నియామకాలు నిర్దేశించిన విధానాల ప్రకారం జరగలేదని విచారణలో తేలిందని వెల్లడించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ సిబ్బంది వేతనం, భత్యాల పెంపులో విధివిధానాలు, నిబంధనలను పాటించలేదని, మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ నియమాకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని మలివాల్‌కు పదేపదే సూచించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ ఆరోపణలపై ఆప్, స్వాతి మలివాల్ ఇంకా స్పందించలేదు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. రాజ్యసభకు నామినేషన్ కావడానికి ముందు స్వాతి మలివాల్ తొమ్మిదేళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఎంపీగా అవకాశం ఇవ్వడంతో ఛైర్మన్ పదవికి ఆమె రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ పదవిలో ఎవర్నీ నియమించలేదు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య నిరంతరం వార్ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతూ.. పాలనను సజావుగా సాగకుండా గవర్నర్ సైంధవుడిగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తమను బద్నాం చేస్తోందని మండిపడుతోంది. ఢిల్లీ మద్యం పాలసీలో మనీల్యాండరింగ్ ఆరోపణలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com