ఈ వేసవిలో ఎండలు ఎలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో కొన్ని రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అసలు ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటనే ప్రజలు హతలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్ర రికార్డ్ స్థాయిలో ఉంటోందని.. ఆ టైంలో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని టీడీపీ అభ్యర్థించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి టీడీపీ రాజ్యసభ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్లేఖ రాశారు. ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ సమయాన్ని పెంచాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ సమయాన్ని మరో గంటల పెంచాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలంగాణలో ఓటింగ్ సమయాన్ని పెంచారని, అదే తరహాలో ఏపీలో కూడా సమయం పెంచాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఓటింగ్ శాతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఓటింగ్ సమయాన్ని పెంచాల్సిందిగా తన లేఖలో కనకమేడల కోరారు.