ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ నాయకులే కాకుండా ఎంతో మంది సినీ, క్రీడా సెలబ్రిటీలు కూడా పోటీ చేస్తున్నారు. కొందరు రకరకాల పార్టీల నుంచి బరిలోకి దిగుతుండగా.. మరికొందరు మాత్రం ఇండిపెండెంట్లుగా ఎన్నికల్లో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు సామాన్యులు కూడా పెద్ద పెద్ద నేతలకు పోటీగా వాళ్ల నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యామ్ రంగీలా. 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా పనిచేస్తున్న.. వారణాసి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన నరేంద్ర మోదీపై.. 30 ఏళ్ల శ్యామ్ రంగీలా పోటీలో నిలిచారు.
ఎన్నికల్లో పోటీ చేయడం, మరీ ముఖ్యంగా ప్రధానిపై బరిలోకి దిగడానికి ప్రత్యేక కారణం ఉందని శ్యామ్ రంగీలా ప్రకటించారు. వారణాసి నియోజకవర్గ ప్రజలకు తాను ఒక ప్రత్యామ్నాయం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సూరత్, ఇండోర్ వంటి నియోజకవర్గాల మాదిరిగా వారణాసిలో కూడా ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవం కావడం తనకు ఇష్టం లేదని.. అందుకే తాను మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. సూరత్ నియోజకవర్గంలో ముఖేష్ దలాల్.. ఇండోర్ నియోజకవర్గం నుంచి శంకర్ లాల్వానీ.. ఎన్నికలు జరగకుండానే పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరు నేతలు బీజేపీకి చెందిన వారు కావడం గమనార్హం.
రాజస్థాన్లోని హనుమాన్గర్హ్ జిల్లాలోని మనక్తేరీ బరనీ గ్రామంలో 1994 లో శ్యామ్ రంగీలా జన్మించారు. శ్యామ్ రంగీలా అసలు పేరు శ్యామ్ సుందర్. గతంలో యానిమేషన్ కోర్సు చేసిన శ్యామ్ రంగీలా.. తనకు ఇష్టమైన కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 2017 లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ అనే వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాయిస్ మిమిక్రీ చేయడంతో శ్యామ్ రంగీలాకు ఫేమ్ వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే తెగ వైరల్ కావడంతో శ్యామ్ రంగీలా ఓవర్నైట్ స్టార్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయిస్ను కూడా శ్యామ్ రంగీలా అచ్చం మిమిక్రీ చేస్తారు.
ఇక 2022 లో శ్యామ్ రంగీలా రాజస్థాన్లోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే ఆప్లో చేరడానికి ముందు కొన్ని ట్వీట్లు చేసిన శ్యామ్ రంగీలా.. వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్ చేశారు. ప్రజలు ప్రధానికి భయపడుతున్నారని.. అందుకే తాను టీవీ షోలకు వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ వాయిస్ను మిమిక్రీ చేయడం నేరమా అంటూ ప్రశ్నించారు. టీవీ షోలకు వెళ్లకపోవడం తనను బాగా నిరాశకు గురి చేసిందని వెల్లడించారు. అయితే తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాను నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు తెలిపినట్లు చెప్పారు. అయితే గత 10 ఏళ్లుగా రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టల కారణంగా అసహనం పెరిగి.. తన మనసు మార్చుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 7 వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇక వారణాసిలో చివరి విడతలో జూన్ 1 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీన వెల్లడికానున్నాయి.