వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవంలేదని, అన్నీ ఇబ్బందులేనని, కూపన్లు, గిఫ్ట్లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి కుయుక్తులు మొదలెట్టారని అన్నారు. రివర్స్ పీఆర్సీతో జగన్ రెడ్డి ఉద్యోగులను నిండా ముంచారని, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని.. ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారని అశోక్ బాబు అన్నారు. తెలుగుదేశం పాలనలోనే ఉద్యోగస్తులకు మేలు జరిగిందని, వారికి గౌరవం దక్కిందని అశోక్ బాబు అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగస్తుల్లో ఏ వర్గానికి మేలు జరగలేదని, ఉద్యోగులను మోసగించిన జగన్ను ఇంటికి పంపాలని అశోక్ బాబు మరోసారి పిలుపిచ్చారు.