కేరళ మహిళా యాక్టివిస్టు రెహానా ఫాతిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అర్థనగ్నంగా కనిపిస్తూ తన సోషల్ మీడియాలో ఖాతాల్లో బుధవారం ఓ వీడియో పోస్టు చేశారు. అందులో తన శరీరంపై కన్నబిడ్డలతో వాటర్ పెయింటింగ్ వేయించుకున్నారు. ‘బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్’ పేరిట పోస్టు చేసిన ఆ వీడియో కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. ‘కంటి సమస్యతో బాధపడుతున్న తల్లి విశ్రాంతి తీసుకుంటుంటే.. ఆమె పిల్లలు ఫోనిక్స్ బర్డ్ చిత్రం వేసి కూల్ చేశారు’ అంటూ వీడియోకు ఫాతిమా కామెంట్ ను జోడించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది.
ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలన్న డిమాండ్లు నెనిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు తీరువల్ల స్టేషన్ పోలీసులు ఫాతిమాపై కేసు సైతం నమోదు చేశారు. ‘వీడియోను ఎలా? ఎందుకు పోస్టు చేశారన్న దానిపై విచారిస్తున్నాం’ అని ఇన్ స్పెక్టర్ తెలిపారు. 2018లో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల తర్వాత ఫాతిమా శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో హిందూవులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్టులకు 18 రోజుల పాటు జైలు శిక్ష సైతం అనుభవించాల్సి వచ్చింది.