ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయం ఒకటి తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే పంచదార, కందిపప్పు ధరలను పెంచింది. సాధారణ తెల్ల రేషన్ కార్డుదారులకు ఇకపై పెరిగిన ధరలకే సరుకులు వస్తాయి. అంటే ఇప్పటివరకూ రూ.40 ఉన్న కందిపప్పు రేటును ప్రభుత్వం... రూ.67కి పెంచింది. అలాగే అర కేజీ పంచదార ధరను రూ.10 నుంచి రూ.17కి పెంచింది ప్రభుత్వం. అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మాత్రం పంచదార ధర ఇదివరకటిలాగే ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఎవరైనా కేజీ కందిపప్పు, కేజీ పంచదార కావాలని అనుకుంటే వారికి అదనంగా అయ్యే ఖర్చు రూ.34. ఇది పేదలకు ఇబ్బందికరమే అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రేషన్ కార్డుల ద్వారానే అంటే దాదాపు 9, 10 రకాల సరుకుల్ని రేషన్ కార్డుల ద్వారా ఇచ్చేవి ప్రభుత్వాలు. కానీ రాన్రానూ వీటి సంఖ్యను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా బియ్యం, కందిపప్పు లాంటి రేషన్ సరుకులు ఇస్తోంది. మొత్తంగా ధరలను పెంచడం అనేది పేదలకు ఆర్థిక భారమే అంటున్నారు నిపుణులు. అసలే కరోనా కాలం. ప్రజల దగ్గర డబ్బు లేదు. ఇలాంటప్పుడు ఈ నిర్ణయం ఇబ్బందికరమే అంటున్నారు.