కొందరు రాజకీయ నేతలను చూస్తుంటే... బడి పిల్లలు గుర్తుకొస్తారు. సారు బెత్తం పట్టుకుంటే... భయభక్తులతో ప్రదర్శిస్తారు. సారు బెత్తం కింద పడేసి, మొహం వేలాడేసుకుని డీలా పడితే... అదే పిల్లలు ఆటాడుకుంటారు. బడి గంట మోగగానే, క్షణం కూడా ఆలస్యం చేయమకుండా తుర్రుమంటారు. ‘ఒరేయ్.. ఆగండర్రా...’ అని మొత్తుకున్నీ కూడా ఏమాత్రం వినిపించుకోరు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ ‘బడి పిల్లలు’ ఇప్పుడు ఇలాగే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి - విశాఖపట్నం ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ‘సైకిల్’ దిగుతారట. ‘కమలం’ పువ్వును చెవిలోనో, జేబులోనో పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారట. బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్దలతో ఇప్పటికే మంతనాలు కూడా సాగించారట. మంచి ముహూర్తం చూసుకుని, టీడీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరతారట.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని అనుకున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం... వలసలను ప్రోత్సహించడం లేదు. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే... తమ పార్టీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాల్సిందేనని మొహం మీదనే చెప్పేస్తున్నారు. దీంతో, టీడీపీ నుంచి వలసలు ఆగిపోయాయి. ఇదే సమయంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. చాలా మందితో మంతనాలు సాగిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బీజేపీలోకి గెంతేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలోనూ ఈ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తమ పార్టీలో చేరితే తగిన గుర్తింపు ఇస్తామని గంటా శ్రీనివాసరావుకు బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే హామీ ఇచ్చిందట. గంటా కూడా సరేనన్నారట. ఆయనతోపాటు టీడీపీ నాయకులు కొందరు కూడా వెళతారట. ఈ వలసలు ఆయనతోనే మొదలవుతుందట. ఆ తరువాత, ఇంకొంతమంది తెలుగు పెద్ద తమ్ముళ్లు కూడా క్యూ కడతారట.