బహుభాషా నటి సుమలతకు తన వల్లే ప్రజల్లో ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండ్యలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా వల్లే సుమలతకు ఈ గుర్తింపు వచ్చింది. ఆమె మండ్య మొత్తం తిరుగుతూ జేడీఎస్ పార్టీకి చెందినవారు దొంగలని ప్రచారం చేస్తుంది. మీలాంటి పుణ్యాత్ముల వల్లే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను. ఇంకెవరి వల్ల కాదు’ అని ర్యాలీకి హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సుమలతకు నిరాశ ఎదురుకావడంతో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ స్థానానికి మార్చి 20న నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మీద పోటీ పడుతున్నారు. కర్ణాటకలో ఏప్రిల్ 18, 23న రెండు, మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.