కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి, ఏఐసీసీ జనరల్ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తాజా ఎన్నికల్లో వారణాశి నుంచి బరిలోకి దిగనున్నారు. ఈమేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. భాజపా నుంచి ఈ స్థానానికి ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరూ కీలక వ్యక్తులే కావడంతో వారణాసి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసేందుకు అంగీకరించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమం’ అని అన్నారు. గత కొన్ని రోజులుగా ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ ఉత్కంఠకు రాబర్ట్ వాద్రా తెరదించినట్లయింది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రచారంలో ఓ కీలకంగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు సమర్పించినప్పుడూ వాళ్లతో కలిసి వెళ్లారు.