టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన కొత్త చిత్రం శేఖర్. రాజశేఖర్ భార్య, సీనియర్ నటి జీవిత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం జోసెఫ్ కు తెలుగు రీమేక్ ఇది. ఇందులో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఒక స్పెషల్ రోల్ లో నటించారు. మంగళవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక, నిర్మాతలు, తదితర చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకను గ్రాండ్ సక్సెస్ చేసారు. స్టేజిపై శివాని మాట్లాడుతూ ఒకింత భావోద్వేగానికి గురయ్యింది. తన వల్ల రాజశేఖర్ కు కోవిడ్ వచ్చిందని, తనకు 3రోజుల్లోనే తగ్గిపోయినా, తన తండ్రికి మాత్రం చాలా సీరియస్ అయిందని శివాని తెలిపింది. ఒక నెలన్నర పాటు హాస్పిటల్ బెడ్ పైనే ఉన్న రాజశేఖర్ ను చూసి జీవితం స్తంభించినట్టు అనిపించిందని చెప్పింది. కోవిడ్ తర్వాత ఈ సినిమాకోసం రాజశేఖర్ చాలా కష్టపడ్డారని, ఒకరకంగా ఈ సినిమా ఆయనకు పునర్జన్మ ఎత్తిన తర్వాత మొదటి సినిమా అని శివాని పేర్కొంది. తన తల్లిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వారందరికీ శేఖర్ సినిమా గట్టి జవాబు ఇస్తుందని శివాని తెలిపింది. శేఖర్ సినిమా మే 20న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.