అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఎంత నష్టం జరిగినా దాన్ని మనకున్నటువంటి సహజ వనరుల వల్ల అభివృద్ధి చేసుకునేందుకు మెండుగా అవకాశాలున్నాయని రవాణా శాఖమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఏపీని అభివృద్ధి చేసుకునేందుకు ఉన్న వనరుల్లో ప్రధానమైనటువంటిది గ్యాస్. ఆంధ్రప్రదేశ్లోని గ్యాస్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాం కానీ ఇంత వరకూ ఏపీ పూర్తిగా వినియోగించుకోలేని విచిత్ర పరిస్థితిలో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.
గతంలో ఏపీని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకమూ సరిగ్గా అమలుకాలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్ను దేశంలో ఉన్న రాష్ట్రాలకే కాకుండా మనం కూడా వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రంతో పలుసార్లు చర్చలు జరిపిన సీఎం మా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ నూటికి నూరు శాతం వినియోగించుకున్న తర్వాతే మిగతా రాష్ట్రాలకు సప్లై చేయాలనడంతో ఇప్పుడు ఏపీలో ప్రతి కుటుంబంలో గ్యాస్ ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ రోజుల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కట్టెల పొయ్యి కనిపించట్లేదు.. అందరూ గ్యాస్ వాడుతున్నారు.. ఇదంతా టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు దక్కిన ఘనత అని మంత్రి చెప్పుకొచ్చారు.