ఆ దేశంలో పరీక్షలు రద్దు చేశారు. దీంతో పాఠశాల పిల్లల్లో సంతోషం నెలకొంది. రద్దు వెనుక కారణం తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. కోవిడ్ మహమ్మారి వల్లనో, ఏదైనా ప్రకృతి విపత్తుల వల్లనో పరీక్షలను రద్దు చేయలేదు. క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ కొనడానికి డబ్బుల్లేక అలా చేశారు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగానే జరిగింది. శ్రీలంక ప్రభుత్వం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. పేపర్ దిగుమతులకు ఆ దేశ ఖజానాలో డబ్బులు లేవు. దీంతో శ్రీలంకలో పాఠశాల విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసిందని అధికారులు శనివారం తెలిపారు. పరీక్షలకు అవసరమైన కాగితం, సిరాను దిగుమతి చేసుకోవడానికి కూడా విదేశీ మారకద్రవ్యం లేదని శ్రీలంక విద్యా విభాగం తెలిపింది. శ్రీలంకలో పేపర్లతో పాటు ఆహారం, ఇంధనం, ఫార్మాపైనా ఆర్థిక సంక్షోభం ప్రభావం గణనీయంగా ఉంది. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు సూపర్మార్కెట్ల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఐఎంఎఫ్ సాయాన్ని శ్రీలంక ప్రభుత్వం కోరింది. ఈ ఏడాదిలో శ్రీలంక 6.9 బిలియన్ డాలర్ల అప్పును చెల్లించాల్సి ఉంది. దేశంలో విదేశీ మారకద్రవ్యం ఫిబ్రవరి చివరి నాటికి 2.3బిలియన్ డాలర్లే ఉంది.