ఇంగ్లాండ్ రాజకుటుంబంలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్ జంట వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో రచ్చకెక్కిన విషయం తెలిసిందే. 2018లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులిద్దరూ కొంత కాలానికే రాచరిక హోదా వదులుకుని, అక్కడి నుంచి బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ సమయంలో జాతి వివక్షను ఎదుర్కొంది నటి మేఘన్ మార్కెల్. అంతేకాకుండా ఆమె కేరక్టర్ను బ్యాడ్ చేసేందుకు చాలా యత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. వాటి వల్ల తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పెళ్లికి ముందు కూడా ఇలాంటివి జరిగినట్లు తెలుస్తోంది. మేఘన్తో అఫైర్ ఉందని చెబితే తనకు కొందరు రూ.50 లక్షలు ఇస్తామని చెప్పినట్లు నటుడు సిమన్ రెక్స్ వెల్లడించాడు. తనకు డబ్బుల అవసరం చాలా ఉందని, అయితే తాను దిగజారి ప్రవర్తించలేనని వారికి చెప్పినట్లు పేర్కొన్నాడు. 'ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలిసినందుకు సంతోషంగా ఉంది' అంటూ మేఘన్ నుంచి తనకు లేఖ అందిందని చెప్పాడు. దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నానని తెలిపాడు.