పురపాలక సంఘాల ఎన్నికల జోరు పెరుగుతోంది. అత్యధిక సంఘాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీలపై తమ పార్టీ జెండాలు ఎగురవేయాలని నాయకులు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని చోట్ల రెబల్ బెడద ఉండటంతో వారిని బుజ్జగించి నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకునేలా మంతనాలు సాగిస్తున్నారు. తద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకుని మెజారిటీ పురపాలక సంఘాలను దక్కించుకోవాలని చూస్తున్నారు. పురపాలికల్లో పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ, టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
గత ఎన్నికల్లో మచిలీపట్నం, పెడన, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు పురపాలక సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది. నూజివీడు పురపాలక సంఘం వైకాపా కైవసం చేసుకుంది. పెడన మున్సిపల్ చైర్మన్ మృతిచెందడంతో జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్ పదవిని వైకాపా కైవసం చేసుకుంది. కాగా మచిలీపట్నం నగరపాలక సంస్థగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో నగరపాలక సంస్థలో పోరు ఆసక్తికరంగా మారుతోంది. అధికార పార్టీకి కొన్ని పుర పాలక సంఘాల్లో రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. నామినేషన్ పత్రాల ఉపసంహరణ జరిగే మార్చి 2, 3 తేదీల్లో ఎవరు వెనక్కి తగ్గుతారో వేచిచూడాల్సిందే.