విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్ని కలిపి ఉంది. పైగా ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారంలోపు ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర మీద ప్రభావం ఉంటుందని.. నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది. మరో పక్క కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. సముద్ర అలల ఉద్ధృతి బాగా పెరిగింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.