శ్రీలంకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేయనుంది. దీనికోసం 600 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆ దేశం అంగీకరించింది. ఈ మేరకు శ్రీలంక ప్రతినిధుల బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాయలంలో జరిగిన ఈ భేటీలో శ్రీలంకలో ఏపీ ప్రభుత్వానికి కేటాయించనున్న భూమి వివరాలను ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
శ్రీలంక ప్రతినిధులతో చర్చలు జరిపానని.. ఫార్మా, హార్టికల్చర్, టూరిజం రంగాల అభివృద్ధి కోసం శ్రీలంకలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రెస్ నోట్ను కూడా విడులచేసింది. శ్రీలంకలో అధ్యయనం చేయడానికి రాష్ట్రం నుంచి త్వరలోనే ఒక ప్రతినిధుల బృందాన్ని ఆ దేశానికి పంపుతామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో రెండోతరం పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తున్నామని, ఏ రంగంలోనైనా తమదైన ముద్రవేసి విజయాలను సాధించే సత్తా వారిలో ఉందన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే శ్రీలంక కంపెనీలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న శ్రీలంకకు చెందిన ‘బ్రాండిక్స్’ దుస్తుల సంస్థ ఇక్కడ 18వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇలాంటి యూనిట్లు మరికొన్ని ఇక్కడ నెలకొల్పాలని శ్రీలంక ప్రతినిధులను సీఎం కోరారు.