బెంగళూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలో దిగుతామని, పొత్తుల విషయమై తమతో ఎవరూ చర్చలు జరపలేదని జేడీఎస్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. 2019 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ తమను పొత్తుకు ఆహ్వానించిందని, కర్ణాటక సీఎంగా తానే కొనసాగవచ్చనే ప్రతిపాదన కూడా పెట్టిందని, అయితే తాము అందుకు అంగీకరించలేదని చెప్పారు.
బీజేపీలో జేడీఎస్ విలీనం అవుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కుమారస్వామి కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలలోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టంచేశారు. జేడీఎస్ బలోపేతం కోసం కార్యాచరణ చేపడుతున్నామని, సంక్రాంతి తర్వాత జిల్లాలవారీగా పార్టీ కార్యకర్తలతో సభలు జరిపి ముందుకు వెళతామని తెలిపారు. ప్రధాని మోదీ తనకు మర్యాదపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని, దానికి ఎన్నికల పొత్తుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.