కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల ధ్రువపత్రాల వ్యాలీడిటీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రం, పర్మిట్ పత్రాల వ్యాలిడిటీ గడువును మార్చి 31, 2021 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘వాహనాల ధ్రువపత్రాలు డీఎల్, ఆర్సీ, పర్మిట్స్ వ్యాలిడిటీ గడువును మార్చి 31, 2021 వరకు పెంచుతూ నిర్ణయించాం. కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకుని వ్యాధి వ్యాప్తి అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రోడ్డు రవాణా శాఖ ప్రకటనలో పేర్కొంది.
ఫిబ్రవరి 1 నాటికి గడువు ముగిసే ధ్రువపత్రాలపై ఈ నిర్ణయం వర్తించనుందని.. ఈ సూచనను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ కోరింది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతోపాటు సెకండ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.