దేశంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి చనిపోయారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి(59) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో.. ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. కొద్దిరోజుల నుంచి వైద్యులు ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో.. ఆదివారం అర్థరాత్రి కిరణ్ మహేశ్వరి తుదిశ్వాస విడిచారు. కిరణ్ మహేశ్వరి 2004 లో ఉదయపూర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఉదయపూర్ నుంచి సచిన్ పైలట్ పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు.