కేంద్ర సర్కార్ గ్యాస్ వినియోగదారులకు షాకిచ్చింది. ప్రతి నెల కూడా వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొంత రాయితీని ఇస్తుంది. గ్యాస్ కొనుగోలు చేసిన వారికి ఆ రాయితీ సొమ్ము ఖాతాలో జమ అయ్యేది. కానీ మే నెలకు సంబంధించి ఆ రాయితీని కేంద్రం జమ చేయలేదు. కేంద్రం గ్యాస్ పై సబ్సిడి ఇవ్వడం సబ్సిడి ఇచ్చిన సొమ్ము వినియోగదారుని ఖాతాలో జమ కావడం కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది. కానీ మే నెలకు సంబంధించిన నగదు మాత్రం ఇప్పటి వరకు వినియోగదారుల ఖాతాలో జమ కాలేదు. ఉదాహరణకు మార్చి నెలలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.862గా ఉంది. వినియోగదారుడు రూ.862 చెల్లించి సిలిండర్ తీసుకుంటే కేంద్రం అతని ఖాతాలో ఓ రూ.162 జమ చేసేది. అంటే అతనికి సిలిండర్ రూ.600కే వచ్చేదన్న మాట. కానీ మే నెలలో అలా జరగలేదు. ప్రతి నెల చమురు ధరల ఆధారంగా ప్రతి నెల ఒకటో తారీఖు గ్యాస్ ధరలు నిర్ణయిస్తారు. మే నెలలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.589.50గా ఉంది. మార్చిలో రూ.862, ఏప్రిల్ లో రూ.796.50గా ఉంది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో రూ.207 గ్యాస్ ధర తగ్గింది. అందుకే ఈ సారి కేంద్రం సబ్సిడి నిలిపేసిందని తెలుస్తోంది. గ్యాస్ ధర భారీగా తగ్గడంతోనే కేంద్రం సర్కార్ సబ్సిడి నగదు జమ చేయడం ఆపేసిందని సమాచారం. మే 1వ తారీఖు నుంచి సిలిండర్లు తీసుకున్న వారంతా నగదు జమ అవుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ నెలకు సంబంధించి నగదు జమ కానట్టేనని తెలుస్తోంది.