ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నాారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శల వర్షం కురిపించారు. లోకేష్ ఏమన్నారంటే…“మాయమాటలు చెప్పటానికే కర్నూలు వెళ్ళారా జగన్ గారు? నిన్నటి మీ పర్యటనలో కర్నూలు జిల్లా గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? తెలుగుదేశం ప్రభుత్వం మొదలు పెట్టిన వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ, ఎల్లెల్సీ బైపాస్ కెనాల్ వంటి ప్రధానమైన ప్రాజెక్టుల గురించి ప్రస్తావన ఏది?
ఓర్వకల్లు పారిశ్రామికవాడ, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కేంద్రాలు, కర్నూలు-అమరావతి రహదారి విస్తరణ, జిల్లాలో సాగునీటి సమస్య వంటి ఎన్నో అంశాలుండగా వాటి గురించి ఒక్క మాటా మాట్లాడలేదు ఎందుకని? అవన్నీ గత ప్రభుత్వం మొదలు పెట్టింది కాబట్టి మీకు అనవసరం అనుకున్నారా? చంద్రబాబుగారు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యకూడదు అనే మీ ధోరణి చూస్తే, మీకు ఎంత కడుపు మంటో అర్ధమవుతుంది. మీరు నిన్న చెప్పినట్టు, నిజంగానే మీ కడుపు మంటకు మందు లేదు…” అంటూ నారా లోకేష్ సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.