సభాపతి ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ తమకు నిరసన తెలిపే అవకాశం కానీ, వాకౌట్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకంగా అసెంబ్లీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తన పాదయాత్రలో నిరుద్యోగులకు జాబు రాలేదని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఏకంగా 7 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న చంద్రబాబు భర్తీ చేయలేదని ఊదర గొట్టిన జగన్.. ఇప్పుడు కేవలం ఏ ప్రాతి పదికన లక్ష 68వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని, అన్నీ అవాస్తవాలు చెప్పి ఓట్లుదండుకున్న లెక్క జగన్దేనని గోరంట్ల విమర్శించారు. ఇప్పటికే అమరావతికి కేవలం 500 కోట్లు కేటాయించి రాజధాని తమ ప్రాధాన్యం కాదని చెప్పిజగన్ పంగనామాలు పెట్టారని, పోలవరం నిలిపేశారని, ప్రాజెక్టులు ఆగిపోయాయని, కానీ అద్భుత రాజధాని నిర్మించేస్తామంటూ మున్సిపల్ మంత్రి బొత్స చెపుతారని వీరి వ్యవహారం ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. నియంతల మాదిరిగా వైసిపి సభ్యులు మాట్లాడుతున్నారని, చరిత్రలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని.. వీరు ఎంత? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు గోరంట్ల