రోజూ కూరగాయలు అమ్ముకుని వస్తే కానీ రోజు గడవని వ్యక్తికి కోట్లు వస్తే.. తన ఖాతాలో తన కలలో కూడా ఊహించనంత డబ్బు పడిందని తెలిస్తే.. అతని పరిస్థితి ఎలా ఉంటుంది. జాక్ పాట్ కొట్టేశాం అని ఆనందపడిపోడూ.. ? ఇటువంటి ఘటనే యూపీలోని ఎటావా జిల్లాలో జరిగింది. ఎటవాకు చెందిన దీపక్ సింగ్ అనే కూరగాయల వ్యాపారి బ్యాంకు ఖాతాలో రూ.4కోట్లు పడ్డాయి.
దీంతో అతని కాళ్లూ చేతులు ఆడలేదు. ఉన్నట్టుండి అంత డబ్బు బ్యాంకు ఖాతాలో రూ. 4 కోట్లు జమ అయినట్టు అతనికి మెసేజ్ వచ్చింది. దీంతో ఇంత పెద్దమొత్తంలో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. కొన్నేళ్లుగా కష్టపడుతూ అతను ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో వేసుకున్న డబ్బు రూ.39 వేలు.
ఒక్కసారిగా రూ.4కోట్లు జమ అవ్వడంతో బ్యాంకు అధికారులకు తెలియజేశారు సదరు వ్యక్తి. దీంతో రికార్డులను పరిశీలించిన సదరు బ్యాంకు అధికారులు సర్వర్లో ఇబ్బందుల కారణంగా అతని పాస్ బుక్లో తప్పుడు ఎంట్రీ నమోదైందని వెల్లడించారు. ఈ విషయమై దీపక్సింగ్ మాట్లాడుతూ పీఐబీకి చెందిన స్థానిక బ్రాంచిలో తనకు ఖాతా ఉన్నదని, తాను పాస్బుక్ అప్డేట్ చేసుకునేందుకు వెళ్లానని, బ్యాంకు సిబ్బంది తన ఖాతాలో రూ. 4 కోట్ల జమ అయిందంటూ అప్డేట్ చేశారని, వెంటనే విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేయగా.. పొరపాటున ఇలా జరిగిందని వారు చెప్పారని అన్నారు. అతని ఖాతాలో కేవలం 39 వేల రూపాయలు ఉన్నాయని, ఖాతాను వెంటనే హోల్డ్లో పెట్టామని చెప్పారు.