కృష్ణాజిల్లాలో గత రెండు రోజులుగా సంచలనం సృష్టిస్తున్న ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం కేసు ఓ కొలిక్కి వచ్చింది. పామర్రు మండలం నాగాపట్నం ప్రగతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందటంతో విషయం కాస్త బైటకు వచ్చింది. ఈ విషయంపై పుకార్లు షికార్లు చేసినా ఎట్టకేలకు వారి ఆచూకీ లభ్యం కావటంతో కథ సుఖాంతమైంది. ప్రగతి కళాశాల విద్యార్దులు విశాఖ పర్యాటక ప్రదేశాలు చూడాలన్న కుతూహలంతో అటు కళాశాలలోనూ, ఇటు ఇంట్లోనూ చెప్పకుండా వెళ్లి పోయారు. లారీ ద్వారా విజయనగరం రైల్వే స్టేషన్ వరకు వెళ్లిన విద్యార్థినుల చేతిలో డబ్బులు అయిపోవటంతో అక్కడే చాలా సేపు ఉండటం గమనించిన రైల్వే పోలీసులు వీరిని ఆరాతీసారు. అయితే తెనాలికి చెందిన విద్యార్థిని తమ దగ్గర డబ్బులైపోయాయంటూ తన తండ్రికి చరవాణి ద్వారా సమాచారం ఇచ్చానని చెప్పడంతో విద్యార్థినిలను తమ సంరక్షణలోకి తీసుకుని, వారి తల్లిదండ్రులకు, పామర్రు పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్ధినుల సమాచారం అందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.