విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు, గిరిజనులపట్ల చంద్ర బాబు సవతి ప్రేమ చూపుతున్నారనీ, మంత్రి వర్గ విస్తరణలో ముస్లింలను, గిరిజనులను విస్మరించడమే అందుకు నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేసారు. ఎన్నికల సమయంలో గిరిజనులకు, మైనారిటీలకు చేసిన వాగ్ధానాలు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక న్యాయం పాటించలేదు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ముస్లిం మైనారిటీలు పెద్దసంఖ్యలో ఉన్నారన్నారు. అయితే గత మూడు సంవత్సరాలవుతున్నా ముస్లింల సంక్షేమం కోసం సమగ్రమైన చర్యలు చేపట్టలేదన్నారు. ముస్లిం వర్గాలకు మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి పదవి ఇవ్వకుండా, గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పదవి ఇవ్వకుండా మైనారిటీలు, గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పడం చంద్రబాబు కప్పదాటు వైఖరికి తార్కాణమన్నారు. వెనుకబడిన వర్గాలను విస్మరించడమే చంద్రబాబు పాటించే సమన్యాయమా అని ప్రశ్నిస్తున్నామన్నారు. ముస్లింలు, గిరిజనుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కు రు.1000 కోట్ల నిధులు కేటాయించి, ముస్లింల సంక్షేమాభివృద్ధికి వినియోగించాలని, ముస్లిం, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్గ చేస్తున్నామన్నారు.