భారతదేశంలో స్త్రీలకు దక్కుతున్న గౌరవ మర్యాదల పట్ల స్టార్ షట్లర్ రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వాలంటూ దేశంలో ప్రతీ ఒకరు చెబుతుంటారు. కానీ నిజానికి అలా చెప్పిన వాళ్లే చాలామంది దానిని పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో మహిళలకు చాలా గౌరవం లభిస్తుందన్నారు సింధు. అందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పడంతో పాటు వారు దానిని పాటిస్తారన్నారు.ప్రతీ ఒకరు ఎదుటవారిని తప్పకుండా గౌరవించాలన్నారు సింధు. ముఖ్యంగా మహిళలకు మర్యాద ఇవ్వాలన్నారు. ఆడవాళ్లు తమపై జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తాలని పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులైనా.. మానసికంగా వేధించినా కూడా సిగ్గు పడకుండా అలాంటి వేధింపులపై పోరాడాలన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ప్రారంభమైన ‘మీటూ’ ఉద్యమం సమాజాంలో అవగాహన తీసుకొచ్చిందన్నారు. స్త్రీపురుషుల బాధ్యతను ఇది గుర్తుచేసిందని అభిప్రాయపడ్డారు. దేశంలోని మహిళలు చాలా ధైర్యవంతులు, శక్తిమంతులని పేర్కొన్న సింధు.. లైంగిక వేధింపులపై గొంతెత్తుతున్నారని పేర్కొంది. మహిళలు ధైర్యవంతులు కావడం ఎంతో అవసరమని చెప్పారు సింధు.