ఏపీలో తిరుగులేని నాయకుడు ఎవరు ఉన్నారు? అంటే వెంటనే చెబుతున్న మాట టీడీపీ అధినేత చంద్రబాబు పేరు. పార్టీలోని నేతలు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నా.. చంద్రబాబు ఇమేజ్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. పాలన పరంగాకానీ, కేంద్రంపై పోరాటం విషయంలోకానీ ప్రజల సమస్యలు తెలుసుకో వడంలోకానీ, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ అనేక రూపాల్లో చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతోంది. విభజన తర్వాత కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవడంలో అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి అంటున్నారు ఏపీ ప్రజలు. ఇక, తిరుగులేని పార్టీ ఏది? అని ప్రశ్నించినప్పుడు కూడా టీడీపీనే అని చెబుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పాత రికార్డులను తిరగరాస్తోంది. నవ్యాంధ్రలో ఇప్పటికి 65 లక్షలు దాటింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఇంకా దీనిని ప్రారంభించలేదు. రెండేళ్ల క్రితం జరిగిన సభ్యత్వ నమోదులో నవ్యాంధ్రలో 64.42 లక్షల మంది చేరారు. ఈసారి ఇప్పటికే వారి సంఖ్య 65.29 లక్షలకు చేరింది. ఈ నెలాఖరు వరకూ ఈ కార్యక్రమం నడుస్తుంది. గత ఏడాది నవంబరు నుంచి కొనసాగుతోంది. తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన నమోదులో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లలో 3,031 మంది టీడీపీ సభ్యుల కుటుంబాలను పార్టీ బీమా ఆదుకుంది. ప్రమాదాల్లో చనిపోయిన వారిలో నవ్యాంధ్రలో 2610 కుటుంబాలకు రూ.60 కోట్ల వరకూ సాయం అందింది. ప్రమాదాల్లో గాయపడిన వారికి రాష్ట్రంలో 63 మందికి.. తెలంగాణలో 26 మందికి సుమారు రూ.50 లక్షల వరకూ సాయం అందజేశారు. దీనికి సమాంతరంగా పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని కూడా లోకేశ్ ప్రారంభించారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో 2 వేల మందికి సుమారుగా రూ.8 కోట్లు అందజేశారు. కార్యకర్తల పిల్లల పెళ్లి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో 365 నూతన జంటలకు పట్టు వస్త్రాలు, కానుకలు ఇచ్చారు.
ఈ పరిణామం పార్టీకి ఎంతో కలిసి వస్తోంది. నిజానికి పలు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలోనూ పార్టీ తరఫున అండగా ఉండడంలోనూ కూడా పార్టీ సభ్యత్వం ప్రామాణికంగానే మారింది. దీంతో ఎక్కువ మంది రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తద్వారా వ్యక్తిగత బీమా కూడా వర్తించడంతో వారికి అన్ని విధాలా మేలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి పార్టీ మరొకటి కనిపించడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.