ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ‌పై దృష్టి పెట్టిన చిన్న‌మ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 14, 2019, 08:55 PM

కేంద్ర మాజీ మంత్రి, విశాఖ పూర్వ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం వున్నదని తెలుస్తోంది. పార్టీ ఆమెను ఉత్తరాంధ్ర క్లస్టర్‌ ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆమె విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అరకులోయ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. తరచూ విశాఖపట్నం వచ్చి ఇక్కడి నేతలతో చర్చిస్తున్నారు.  ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీగా కంభంపాటి హరిబాబు  పార్టీ ఉన్నత స్థాయి సమావేశాలకు హాజరవుతున్నా.. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని పార్టీ అగ్రనేతలకు చూచాయగా చెప్పేశారు. దాంతో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్‌గా కాశీ విశ్వనాథరాజును పార్టీ నియమించింది. కాశీ కూడా తానే వచ్చే ఎన్నికల్లో బీజేపీ  ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నారు. 


మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా అవకాశం వస్తే బీజేపీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొద్దికాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా వుంటున్న ఆయన అందుకే ఢిల్లీలో పార్టీ కోర్‌ కమిటీ సమావేశానికి హాజరయ్యారని విశ్లేషిస్తున్నారు. అయితే విష్ణుకుమార్‌రాజుకు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆఫర్‌ వుందని ఏ పార్టీ తరపున బరిలో దిగుతారో వేచి చూడాల్సిందేనని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com