ఏలూరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సామాన్యులకు అండగా ఉండాలనే పార్టీ స్థాపించానని చెప్పారు. 2008 నుండే ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నానన్న పవన్ ఆర్ధిక ప్రగతి కొంతమందికే పరిమితమైందన్నారు. సమాజం బాగుండాలనే 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చానని.. ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగడం లేదనే బయటకు వచ్చానని చెప్పారు. నా ధైర్యం ప్రజలేనన్న అయన ఓట్లు వేసినా వేయకున్నా జనసేన సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. పవన్ తింటే నేనే దెబ్బలు తింటా.. పోతే నా ప్రాణమే పోవాలి.. కానీ సామాన్య ప్రజల సుఖమే నాకు కావాలి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. డబ్బు తెగించి నేను రాజకీయాలు చేయాలనుకోడం లేదని.. ప్రాణాలను తెగించే పార్టీ పెట్టానని చెప్పారు. ఎంతోమంది నిరుత్సాహ పరిచినా వయసు, తెలివి ఉండగానే ప్రజలకు ఎదో చేయాలని వచ్చానని అన్నారు. బలమైన సామాజిక మార్పు కోసం మీరంతా నాకు అండగా ఉండాలని మార్పు తెచ్చి చూపిస్తానని చెప్పారు. జనసేనలో రౌడీలు, గుండాలు లేరన్న పవన్ మన పార్టీకి యువతే అండగా ఉన్నారన్నారు.