అసెంబ్లీలో కావచ్చు.. బయట కావచ్చు తనదైన శైలిలో పంచ్లు వేస్తూ మాట్లాడతారు విశాఖ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఆయనకు రాజకీయాల్లో అపరిచితుడులా మంచి గుర్తింపు ఉంది. కాసేపు చంద్రబాబును, మరికొంతసేపు జగన్ను పొగుడుతూ ఉంటారాయన. కొన్ని రోజులు చంద్రబాబుపై విమర్శలు.. మరికొన్ని రోజులు జగన్పై విరుచుకుపడతారు. ఇలా ఉసరవెల్లిలా ప్రవర్తిస్తూ ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విష్ణుకుమార్ రాజు. విశాఖ భూకుంభకోణంకు సంబంధించి టీడీపీ నేతల పేర్లను ఆయన జగన్కు అందించారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా జరిగింది. వైఎస్ జగన్కు రహస్య స్నేహితుడుగా ఆయనను అందరూ పిలుస్తూ ఉంటారు.
అయితే అసెంబ్లీలో తన మార్క్ సెటైర్లతో ఎప్పుడూ నవ్వులు పూయిస్తూ ఉంటారు విష్ణుకుమార్ రాజు. సభ హాట్హాట్గా జరుగుతున్న సమయంలో ఆయన వేసే జోకులతో సభ ఒక్కసారిగా కూల్ అవుతుంది. అసెంబ్లీలో తన మార్క్ సెటైర్లు, జోకులతో అందరినీ నవ్విస్తూ ఉంటారు విష్ణుకుమార్ రాజు. బీజేపీ నుంచి అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడేది ఆయననే చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూనే ..మరోవైపు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. దీంతో ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి.
ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో చంద్రబాబుపై ,విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మరాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.నేటి నుంచి ఈ నెల 19వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం ఏడు రోజులు అసెంబ్లీ జరగనుంది. అయితే ఈ సారి కూడా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి హాజరుకాలేదు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన 22మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే తాము తక్షణమే అసెంబ్లీకి హాజరవుతామని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చంద్రబాబుకు లేఖ రాశారు. అంతకు ముందు ఎమ్మెల్యేలందరికీ ఫోన్ చేసిన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీకి రావాలని కోరారు.
అయితే నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు.. విశాఖలోని కేజీహెచ్లో పడక కొరత ఉందన్నారు. గతంలో కామినేని శ్రీనివాస్ కేజీహెచ్లో రాత్రి బస చేశారని, ఆ తర్వాత ఆయన పోస్టు పోయిందని అన్నారు. అక్కడ ఏందో సెంటిమెంట్ ఉందని, అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగారు పడుకోవాల్సిన అవసరం లేదు.. విజిట్ చేస్తే చాలు. ఆయన కనుక విజిట్ చేస్తే కేజీహెచ్ రూపురేఖలు మారిపోతాయనే నమ్మకం ఉంది. తప్పకుండా కేజీహెచ్ బాగుపడుతుంది.’’ అంటూ విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.