బెంగళూరు : జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏకతాటి మీద నడిపేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఉభయ పక్షాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. కీలక విధాన నిర్ణయాలపై అభిప్రాయ బేధాలకు తావులేని విధంగా పరస్పరం చర్చల ద్వారా నిర్ణయించేం దుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకునే ఆలోచన ఉన్నట్టు కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉండేదీ కాంగ్రెస్ వైపునుంచి ఆ పార్టీ అగ్రనాయకులు, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ సమక్షంలో నిర్ణయం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని సాఫీగా నడిపేందుకు ఇరుపక్షాల మధ్య ఈ కమిటీ వారధిగా పని చేస్తుందని వెల్లడించారు.