అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీలు చేసిన పోరాటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. గత మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్ని విధాలుగా సహకరించామని చెప్పిన ఆయన కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందలేదన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు సమయాలలో కేంద్రానికి తెలుగుదేశం అండగా నిలిచిందని గుర్తు చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోకుండా ఇబ్బంది పెట్టడం అంటే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని బీజేపీ, కేంద్రం గుర్తించాలని చంద్రబాబు అన్నారు.
విభజన చట్టం, హామీల అమలు చేసే వరకూ కేంద్రంతో రాజీలేని పోరాటానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలంటూ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే విపక్షం అడ్డుపడటం దారుణమని అన్నారు. విపక్షం తీరు తొలి నుంచీ అలాగే ఉందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే విపక్షం మాత్రం లేఖలతో అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఉపాధి నిధులపై ఫిర్యాదులు చేయడం విపక్ష అరాచకాలకు, కుట్రలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు.