మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా జోర్దాన్ పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పాలస్తీనా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా తొలుత మోదీ పాలస్తీనా ప్రధాని రమీ హమదల్లాహ్తో కలిసి పాలస్తీనా లీడర్ యస్సర్ అర్ఫాత్ సమాధి వద్ద నివాళులర్పించారు. పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా మోదీ, అధ్యక్షుడు అబ్బాస్ పలు ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ పరిస్థితుల గురించి చర్చలు జరపనున్నారు. మోదీ రాక సందర్భంగా అధ్యక్షుడు అబ్బాస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా భారత్ ఎంతో గౌరవమైన దేశమని కితాబిచ్చారు.
ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. రామల్లాహ్ చేరుకున్న మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ను కలుసుకోనున్నారు. ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు. పాలస్తీనా పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ శనివారం సాయంత్రం నాటికి అబుదాబి చేరుకుంటారు.