లిబియాలోని బెంగాజీ నగరంలో శుక్రవారం నాడు ఓ మసీదులో సంభవించిన భారీ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరో 143 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం వెలుపలికి వస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని, లిబియా తూర్పు ప్రాంత సైనిక దళాల ప్రతినిధి కల్నల్ మిలుద్ జువారు చెప్పారు. మసీదులోపల ఉంచిన పేలుడు పదార్ధాలుంచిన బ్యాగ్లను రిమోట్ ద్వారా పేల్చటంతో ఈ పేలుడు జరిగినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిందని ఆయన వివరించారు. సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఒక మృతదేహంతో పాటు 87 మంది క్షతగాత్రులను తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని బెంగాజీలోని అల్ జలా ఆస్పత్రి సమాచార అధికారి పదియా అల్ బర్గతి వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలోని మసీదులన్నింటిలో రెండు వారాల్లోగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని సెంట్రల్ సెక్యూరిటీ ఛాంబర్ అధిపతి జనరల్ వానిస్ బక్మాడా ఆదేశాలు జారీ చేశారు.