న్యూఢిల్లీ : కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపారు. విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావనే చేయని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో బెంగళూరు, ముంబై లకు మాత్రం భారీగా నిధులు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగం మొత్తంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేదు. సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులకు పన్ను రాయితీని లక్ష రూపాయిల వరకూ పెంచారు. ప్రస్తుతం 60 వేల రూపాయిలుగా ఉన్న రాయితీని లక్షకు పెంచారు. అలాగే ప్రయాణ, వైద్య ఖర్చులకు 40 వేల వరకూ పన్ను రాయితీని ప్రకటించారు. ప్రయాణ వైద్య ఖర్చులకు 40 వేల రూపాయిలకు స్టాండర్డ్ డిడక్షన్ను వర్తింపజేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక నుంచి వారు చెల్లించాల్సిన ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ వాటాను మూడేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది అన్ని రంగాలలోని ఉద్యోగులకూ వర్తిస్తుంది. అలాగే మహిళా ఉద్యోగులపై కూడా జైట్లీ కరుణ చూపారు. వారు ప్రావిడెంట్ ఫండ్ వాటా కింద తమ వేతనాల్లోంచి చెల్లిస్తున్న వాటాను 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించారు.