గుంటూరు: విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి చెప్పి, మరమ్మత్తులు చేసేందుకు స్తంభం పైకి ఎక్కిన జూనియర్ లైన్ మెన్ విద్యుదాఘతానికి గురైన సంఘటన వెల్దుర్తి మండలంలోని శ్రీరాంపురం తండాలో జరిగింది.
గ్రామానికి చెందిన హనుమానాయక్ సచివాలయం జూనియర్ లైన్ మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో బోదిలవీడు సబ్ స్టేషను ఫోన్ చేసి సిబ్బందికి తండాకు వచ్చే సరఫరా నిలిపేయాలని(ఎల్సీ) సూచించారు. స్తంభం పైకి ఎక్కి పనులు చేస్తున్న సమయంలో విద్యుత్తు సరఫరా జరిగింది. దీంతో హనుమానాయక్ విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ
వైద్యశాలకు తరలించారు.
విద్యుత్తు ఉపకేంద్రం, పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన
హనుమానాయక్ వరుసుగా రెండుసార్లు విద్యుత్తు ప్రమాదాలకు గురైన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. విద్యుత్తు ఉపకేంద్రం వద్ద సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, దాడిచేసేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధీర్ ఉప కేంద్రం సిబ్బందిని తన వెంట స్టేషను తీసుకెళ్లారు. ఆందోళన చేస్తున్నవారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి 7.30 గంటల దాకా తండా వాసులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఏఈ ఆంజనేయులును వెల్దుర్తి పోలీసులు పిలిపించి వివరాలు తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఏదైనా జరిగి ఉంటే చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ హెచ్చరించారు. దీనిపై ఏఈ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యుత్తు ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.