దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి.దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదవగా, 4120 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,37,03,665కు చేరగా, మృతులు 2,58,317కు చేరారు. మరో 1,97,34,823 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 37,10,525 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున ఉండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 20 వేల చొప్పున ఉండగా, ఉత్తరప్రదేశ్లో 15 వేలు, రాజస్థాన్లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17,72,14,256 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
ఇక డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి భారత్లో నమోదైన కేసులు.. ప్రపంచం మొత్తం కేసుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయని పేర్కొన్నది. అంటే ఈ మూడు రోజుల్లో భారత్లో నమోదైన కేసుల కంటే అన్ని దేశాల్లో రికార్డయిన కేసులే తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. మరణాలు కూడా మూడో వంతు ఇండియాలోనే నమోదయ్యాయని తెలిపింది. దీంతో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా సంభవించిన దేశాల్లో భారత్ అగ్రభాగంలో నిలిచిందని పేర్కొంది.
గత 24 గంటల్లో బ్రెజిల్లో 25,200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో ఇండియా తర్వాతి స్థానంలో బ్రెజిల్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలో 22,261, ఫ్రాన్స్, ఇరాన్లో 18 వేల చొప్పున నమోదయ్యాయి. ఈ దేశాల్లో కంటే భారత్లోని నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు నమోదవడం గమనార్హం.