చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ ప్రారంభించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, శంకర్నారాయణ, ఆదిమూలపు సురేష్ సహా ఇతరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాన్ని చూశానని సీఎం జగన్ అన్నారు. వారికి శ్రమ ఎక్కువ, లాభం తక్కువ ఉండేదని చెప్పారు. 'ఆత్మగౌరవంతో అమూల్య సేవలందిస్తోన్న మహనీయులు చిరువ్యాపారులు. వారు లేకపోతే వారి బతుకు బండే కాదు. ఆర్థిక వ్యవస్థ కూడా నడవదన్నారు. రూ.3 నుంచి రూ.10 వడ్డీతో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి చిరువ్యాపారులదని అలాంటి వారిని ఆదుకుంటాం' అని ముఖ్యమంత్రి చెప్పారు.