కరోనా కేసుల్లో భారత్ చైనాకు సమీపంలో నిలిచింది. ఈ వైరస్ ప్రభావిత దేశాల్లో ప్రస్తుతం చైనా 11వ స్థానంలో ఉండగా, భారత్ 12వ స్థానంలో ఉంది. క్రియాశీల కేసుల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చైనాలో కేసుల సంఖ్య 82,900 దాటగా, కేంద్ర వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మంగళవారం నాటికి భారత్లో కేసులు 70,756కి చేరాయి. ముందురోజుతో పోలిస్తే 3,604 (5.36%) కొత్త కేసులు వచ్చాయి. 1,538 (7.35%) మంది కోలుకున్నారు, 87 (3.94%) మంది మరణించారు. మంగళవారం నాటికి రికవరీ రేటు 31.73%కి, మరణాల రేటు 3.24%కి చేరింది. నెలరోజుల క్రితం నాటి మరణాల రేటు 3.23%తో పోలిస్తే ఇది ఇప్పటికీ దాదాపు ఒకేలా ఉంది. రికవరీ రేటు మాత్రం 30 రోజుల్లో 9.05% నుంచి 31.73%కి చేరింది. గత 24 గంటల్లో 24 రాష్ట్రాల్లో మరణాలు సంభవించలేదు. పదిరాష్ట్రాల్లో కొత్తకేసులు రాలేదు. మరణాలు కేవలం 9 రాష్ట్రాలకు పరిమితం కాగా అందులో 64% మహారాష్ట్ర, గుజరాత్ల్లోనే చోటుచేసుకున్నాయి. మే 5 నుంచి కేసుల వృద్ధి ఉద్ధృతమైంది. ఈ ఎనిమిది రోజుల్లో రోజుకు సగటున 3,490 చొప్పున 27,920 కేసులు వచ్చాయి. దేశంలో తొలికేసు నమోదైన నాటినుంచి 28వేలకు చేరుకోవడానికి 83 రోజులుపట్టగా, గత 8 రోజుల్లోనే అందుకుసమానమైన కేసులు నమోదయ్యాయి. చైనాలో మరణాల రేటు 5.58% ఉండగా, భారత్లో అది 3.24%కి పరిమితం కావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే అక్కడ రికవరీ రేటు మనకన్నా దాదాపు మూడు రెట్లు (94.27%) అధికంగా ఉంది.