న్యూయార్క్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. అలాంటి చోట 18 అపార్ట్మెంట్లకు ఓనరైన మారియో సలెర్నో... దాదాపు 300 మందికి ఇళ్లు అద్దెకు ఇచ్చాడు. ఐతే... కరోనా వైరస్ వ్యాపించాక... చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. చేతిలో డబ్బు లేని పరిస్థితి ఏర్పడింది. వారి కష్టాలు, సమస్యల్ని అర్థం చేసుకున్న మారియో... ఏప్రిల్ నెలకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని వారికి తెలిపాడు. దాంతో... వేల మంది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అద్దె డబ్బులు తనకు ముఖ్యం కాదన్న మారియో... ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమన్నారు.
న్యూయార్క్లో కరోనా వైరస్ ఎంతలా విజృంభించిందంటే... ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ చెయ్యలేక డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఇతర ఎమర్జెన్సీ కేసులేవీ తీసుకోవట్లేదు. సిటీలో ఎక్కడ చూసినా కరోనా పాజిటివ్ కేసులే. అలాంటి తీవ్ర ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటడంతో... మారియో... తనకు రూ.కోట్ల నష్టం వచ్చినా పర్వాలేదని అనుకున్నాడు. అసలే ఉద్యోగాలు, ఉపాధీ లేని సమయంలో... తాను ఓ నెల అద్దెను త్యాగం చేస్తే తప్పేముందని భావించాడు. ఇంట్లోనే ఉంటూ... చుట్టుపక్కల వారికి సాయం చేస్తూ... చేతుల్ని శుభ్రంగా కడుక్కోమని తన ఇళ్లలో అద్దెకు ఉండేవారికి సూచించాడు.
అమెరికాలోని మిగతా నగరాల్లో కంటే... న్యూయార్క్లోనే అద్దెలు ఎక్కువ. ఇంటి అద్దె చెల్లించాలంటే... వేలకు వేలు వదిలిపోతాయి. మిగతా నగరాల్లో కంటే... న్యూయార్క్లోనే అద్దెకు ఉండేవారు కూడా ఎక్కువ. కరోనా వైరస్ వల్ల ఎకానమీ ఒక్కసారిగా కుప్పకూలడంతో... న్యూయార్క్ వాసులకు చేతిలో మనీ లేకుండా అయిపోయింది. మార్చిలో జరిపిన చాలా సర్వేల్లో... దాదాపు 40 శాతం మంది తాము ఇళ్ల అద్దె చెల్లించలేమని తెలిపారు. అద్దెలే కాదు... టాక్సులు, వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేదు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో... మారియో... అద్దె చెల్లించవద్దని చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం అవుతోంది. ఇండియాలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అందువల్ల ఇండియాలో కూడా ఇంటి ఓనర్లు దయతలచాలని కొందరు అద్దె ఇళ్లలో ప్రజలు కోరుతున్నారు.