చైనాలో కరోనా వైరస్ ఇంకా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టనేలేదు. ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే, ఈ క్రమంలో మళ్లీ మరోసారి చైనా హాట్ టాపిక్గా మారింది. వాయువ్య చైనాలోని మార్కెట్లలో మళ్లీ కుక్కలు, పిల్లలు, గబ్బిలాలను విక్రయిస్తున్నారు. ప్రజలు వాటిని కొనుక్కుని తినడానికి బారులు తీరుతున్నారు. అసలు చైనాలో కరోనా వైరస్ గబ్బిలాల ద్వారానే మనుషులకు వ్యాపించిందని ప్రాధమికంగా అంచనా వేశారు. అయితే, ఇంకా కరోనా భయం ప్రపంచాన్ని ఇంకా వీడనే లేదు. మళ్లీ చైనీయులు గబ్బిలాలను వండుకుని తినేస్తున్నారంటూ వాషింగ్టన్ ఎగ్జామినర్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు చైనాలో ఈ కుక్కలు, పిల్లలు, గబ్బిలాల మార్కెట్ల ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
గతంలో ఇలాంటి మార్కెట్ల వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తుందనే నివేదికలు రావడంతో ప్రభుత్వం అడవి జంతువుల మాసం విక్రయాలను నిషేధించింది. అయితే, ఇప్పుడు మళ్లీ గతంలో లాగానే మార్కెట్లు తెరుచుకున్నాయి. జనం కూడా బాగానే వస్తున్నారని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. అయితే, ఒక్కటే ప్రత్యేకత ఏంటంటే, గతంలో ఇక్కడ ఫొటోలు తీసుకుంటుంటే ఏమీ అనేవారు కాదు. ఇప్పుడు ఫొటోలు తీసుకుంటుంటే మాత్రం సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకుంటున్నారు.
చైనాలోని మాంసం మార్కెట్లు అత్యంత అపరిశుభ్రంగా ఉంటాయని, అలాగే, జంతువుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తారనే పేరు ఉంది. అయితే, చైనాలో ప్రస్తుతం కొత్తగా కరోనా కేసులు పెరగకపోవడంతో మళ్లీ ఈ మాంసం మార్కెట్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.